ఐరాస, ఆగస్టు 9: చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యానికి అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సముద్ర జలాలపై వివిధ దేశాలు తమ మధ్య ఉన్న వివాదాలను అంతర్జాతీయ చట్టాల ఆధారంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రకృతి విపత్తులు, ఇతర ముప్పులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశానికి మోదీ వర్చువల్గా అధ్యక్షత వహించారు. మండలి భేటీకి అధ్యక్షత వహించిన తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. ఆగస్టు నెలంతా మండలికి భారత్ అధ్యక్షత వహించనుంది.
ఇందులో భాగంగా ‘సముద్ర భద్రత- అంతర్జాతీయ సహకారం’ అనే అంశంపై మోదీ అధ్యక్షతన జరిగిన చర్చలో పలు దేశాలు పాల్గొన్నాయి. ‘సముద్ర భద్రత’కు మోదీ పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవడం పరస్పర నమ్మకానికి చాలా ముఖ్యమని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో చైనాకు ఉన్న వివాదాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘సాగర్’ పథకాన్ని మోదీ ప్రస్తావించారు.
మండలిలో అమెరికా-చైనా ఢీ
భద్రతా మండలి సమావేశంలో అమెరికా, చైనా పరస్పరం విమర్శల దాడికి దిగాయి. దక్షిణ చైనా సముద్రంలో రెచ్చగొట్టే చర్యలు తగవని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ పరోక్షంగా చైనాను హెచ్చరించారు. ఇతర దేశాలను భయపెట్టి, న్యాయంగా వాటికి దక్కే వనరులను వినియోగించుకోకుండా చేయడం మంచిది కాదని చెప్పారు. దీనిపై చైనా ఉప శాశ్వత ప్రతినిధి డయ్ బింగ్ స్పందిస్తూ దక్షిణ చైనా సముద్రం అంశాన్ని చర్చించడానికి భద్రతా మండలి సరైన వేదిక కాదని అన్నారు. ఈ అంశాన్ని అమెరికా ప్రస్తావించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
పీఎం కిసాన్ నిధులు విడుదల
పీఎం కిసాన్ పథకంలో భాగంగా 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లను కేంద్రం సోమవారం జమ చేసింది. ఈ సందర్భంగా వర్చువల్గా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. పీఎం-కిసాన్ కింద ఇప్పటి వరకు రూ.1.6 లక్షల కోట్లు బదిలీ చేశామని చెప్పారు. మరోవైపు, వంటనూనెల ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధించే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని ప్రధాని ప్రకటించారు. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్-ఆయిల్పామ్ కార్యక్రమం కింద రూ.11 వేల కోట్ల పెట్టుబడి పెడతామని తెలిపారు. దేశీయ అవసరాలకు సరిపడా వంటనూనెలను మనమే ఉత్పత్తి చేసుకోవాలని, దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని చెప్పారు.