క్వీటో, ఆగస్టు 10: మరో పది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయనగా ఈక్వెడార్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రగ్ మాఫియా, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తుతూ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడ్డ ఫెర్నాండో విల్లావిసినిసియోను రాజధాని క్వీటోలో బుధవారం కొంతమంది దుండగులు కాల్చిచంపారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో హత్యను దేశాధ్యక్షుడు లాసో తీవ్రంగా ఖండించారు. మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. శాంతిభద్రతలు నెలకొల్పటం కోసం భద్రతా బలగాల్ని మోహరించేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నానని లాసో తెలిపారు.
ఫెర్నాండో హత్యకు సంబంధించి క్వీటో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగుర్ని అరెస్టు చేశారు. అంతర్జాతీయంగా నేరాలకు పాల్పడుతున్న ఓ గ్రూప్ ఈక్వెడార్లో ఉందని, తనను చంపుతామంటూ ఈ గ్రూప్ నుంచి పదే పదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గతంలో ఫెర్నాండో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం నాటి ఎన్నికల ప్రచారానికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ‘దేశంలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తాను. దొంగల చేతిలో బందీ అయిన దేశాన్ని కాపాడుతా’నని ప్రజలకు వాగ్దానం చేశారు. మరికొద్ది సేపటికి ఆయనపై కాల్పులు చోటుచేసున్నాయి.