బీజింగ్: షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ఈసారి ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే ఆ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్(Xi Jinping) వర్చుల్ విధానంలో మాట్లాడనున్నారు. చైనా అధికారులు ఇవాళ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు బీజింగ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీజిన్పింగ్ మాట్లాడుతారని తెలిపారు. జూలై 4వ తేదీన ఎస్సీవో మీటింగ్ జరగనున్నది. ఆ సమావేశాల్లో జిన్పింగ్ కీలకమైన సందేశం ఇస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యుంగ్ తెలిపారు.
ఇండియా ఆతిథ్యం ఇస్తున్న ఎస్సీవో మీటింగ్లో జీ జిన్పింగ్ పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది. ఎస్సీవోను 2001లో షాంఘైలో జరిగిన సమావేశంలో ఏర్పాటు చేశారు. రష్యా, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్థాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. రొటేషన్ పద్ధితి ప్రకారం ఈసారి ఎస్సీవో ప్రెసిడెన్సీ పదవిని ఇండియా దక్కించుకున్నది. బీజింగ్లో ఉన్న ఎస్సీవో సెక్రటేరియేట్లో ఇటీవలే న్యూఢిల్లీ హాల్ను ఆవిష్కరించారు.