టోక్యో, మార్చి 16: జపాన్ను భూకంపం మరోసారి వణికించింది. బుధవారం రాత్రి ఉత్తర జపాన్లో ఫుకుషిమా తీరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. తీవ్రత నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మీటరు ఎత్తు సునామీ అలలు తీరంపై విరుచుకుపడవచ్చని హెచ్చరించారు. సముద్ర మట్టానికి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొన్నారు. భూకంపం ప్రభావంతో టోక్యో సహా అనేక నగరాల్లో విద్యుత్తు లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 20 లక్షల ఇండ్లు అంధకారంలో చిక్కుకొన్నాయి. ప్రాణ నష్టంపై సమాచారం లేదు. పదకొండేండ్ల క్రితం 2011లో ఫుకుషిమా తీరంలో 9.0 తీవ్రతతో అత్యంత భయానక భూకంపం, ఫలితంగా సునామీ విరుచుకుపడింది. ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రంలో కూలింగ్ వ్యవస్థ దెబ్బతిని రియాక్టర్లు కరిగిపోయాయి. న్యూక్లియర్ రేడియేషన్ వాతావరణంలోకి వ్యాపించింది.