వార్సా, ఆగస్టు 22: యుద్ధ భూమిలో ఏ సమస్యా పరిష్కారం కాదని భారత్ గట్టిగా నమ్ముతున్నదని, ఉక్రెయిన్లో శాంతి, సుస్థిర పరిస్థితులు పునరుద్ధరించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాని మోదీ అన్నారు.
పోలండ్ పర్యటన సందర్భంగా ప్రధాని గురువారం మీడియాతో మాట్లాడుతూ చర్చలు, దౌత్యపరమైన చర్యల ద్వారా ఎక్కడైనా శాంతి, సుస్థిరత నెలకొల్పవచ్చునని ఆయన పేర్కొన్నారు. మోదీ, పోలండ్ ప్రధాని డొనాల్ట్ టస్క్ సమావేశమై ఇరు దేశాలు రక్షణ, భద్రత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చర్చల అనంతరం మోదీ-టస్క్ సంయుక్తంగా ఐదేండ్ల కార్యాచరణ ప్రణాళిక (2024-2028)ను ఆవిష్కరించారు.