న్యూయార్క్: అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో నేడు ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఐరాస సాధారణ సమావేశం వర్చువల్గా నిర్వహించిన విషయం తెలిసిందే.
‘న్యూయార్క్ సిటీకి చేరుకున్నాను. సెప్టెంబర్ 25న సాయంత్రం 6.30 గంటలకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ అంతకుముందు వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలు, ఆఫ్ఘనిస్థాన్ సహా తాజా అంతర్జాతీయ పరిస్థితలుపై చర్చించారు. అనంతరం క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ భేటీకి ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు స్కాట్ మారిసన్, యొషిహిదే సుగాలు హాజరయ్యారు.
కాగా, న్యూయార్క్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. మోదీ ఉన్న హోటల్ బయట ప్రవాస భారతీయులు వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు.