చైనాలోని షాంఘైలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ, లాక్డౌన్ విధించింది. అయితే.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు షాంఘైను విడిచిపెట్టి, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
అయితే.. లాక్డౌన్ ఉన్నా సరే.. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని ప్రజలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా పట్టణాన్ని విడిచి వెళ్లడానికి ప్రజలు ఒకరికొకరు ఉపాయాలు కూడా చెప్పుకుంటున్నారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు.
షాంఘై అత్యంత కీలకమైన సిటీ. ఎన్నో ఐటీ కంపెనీలు కూడా వున్నాయి. విదేశీయులు కూడా వున్నారు. కోవిడ్ దృష్ట్యా… ఈ సిటీని విడవడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రతి నెలా ప్యాకర్స్ అండ్ మూవర్స్కు 30 నుంచి 40 ఆర్డర్లు వుండేవి. కానీ.. ప్రస్తుత దశలో ఆర్డర్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఇక ఇబ్బందులు కూడా ప్రజలకు పెరిగిపోతున్నాయి. తినడానికి తిండి కూడా దొరకడం గగమనే. కేసుల కారణంగా ఇరుగు పొరుగు వాళ్లు కూడా సహాయం చేయడానికి ఏమాత్రం ముందుకు రావడం లేదు. కేసుల కారణంగా దాదాపుగా అందరూ ఐసోలేషన్లోనే వుండిపోతున్నారు. విదేశీయులకైతే తిండి దొరకడం గగనమై కూర్చుంది.
కోవిడ్ ఇంతగా విజృంభిస్తున్నా… ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విదేశీయులు చైనా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక.. షాంఘైను విడిచిపెట్టడమే అత్యుత్తమమన్న నిర్ణయానికి వచ్చామని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. ఇక క్యాబ్ రేట్లు కూడా విచ్చలవిడిగా పెరిగిపోయాయి. నిజానికి విమానాశ్రయం వెళ్లడానికి 30 డాలర్లు ఖర్చైతే, క్యాబ్ డ్రైవర్లు 500 డాలర్లు తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పాఠశాలల మూసివేత…
కరోనా కేసుల కారణంగా షాంఘైలోని పాఠశాలలన్నింటినీ ప్రభుత్వం మూయించింది. కరోనాను అరికట్టడానికే ఇలా చేశామని అధికారులు పేర్కొంటున్నారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తామన్న అంచనాకు కూడా అధికారులు రాలేకపోతున్నారు. ఆన్లైన్ క్లాసులను కూడా నిర్వహించడం లేదు.