Situation @ Ukraine | ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్న కొద్దీ పరిస్థితులు విభిన్నంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాలు రష్యా దాడుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిత్యవసరాలు, మౌలిక సదుపాయాలు కరవై ప్రజలు అల్లాడుతున్నారు. పలు నగరాల్లో విద్యుత్, తాగునీరు సరఫరా లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. తొలిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలిపారు. ఇదే సమయంలో దేశంలో పైచేయి సాధించేందుకు జెలెన్స్కీ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం సహా పలు పార్టీలపై నిషేధం విధించారు. పలువురు నేతలను జైళ్లో నిర్బంధించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగి 9 నెలలు కావస్తుండటంతో ఉక్రెయిన్లో పరిస్థితులు దారుణంగా మారాయి. కరెంటు కోతలు, నీటి ఎద్దడి మధ్య ప్రజల్ని చలి వణికిస్తున్నది. జెలెన్స్కీకి వ్యతిరేకంగా మొదటిసారి ప్రజల గొంతు విప్పారు. కైవ్తో పాటు విన్నిట్సా, మైకోలైవ్, ఒడెస్సా నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిపి ప్రభుత్వానికి తమ బాధలను వెళ్లగక్కారు. యుద్ధం కారణంగా ప్రభుత్వంపై ఎక్కువ భారం మోపడం ఇష్టం లేక ఇన్నాళ్లూ మిన్నకున్నామని, అయితే ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా యుద్ధంపైనే దృష్టి సారిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇలాఉండగా, దేశంలో మార్షల్ లా అమలు చేస్తున్నారు. జెలెన్స్కీ రాజకీయ ప్రయోజనం కోసం కొత్త కార్యాచరణ చేపట్టారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు విక్టర్ మెద్వెచుక్తో పాటు దాదాపు ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లో వేశారు. మెద్వెచుక్ మాత్రం జైలు నుంచి తప్పించుకుని ఓ రహస్య ప్రదేశంలో తలదాచుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 11 ప్రధాన ప్రతిపక్ష పార్టీల గుర్తింపును జెలెన్స్కీ రద్దు చేశారు. వీటిలో ప్రధాన ప్రతిపక్షం ఫర్ లైఫ్ పార్టీ (ఎఫ్ఎల్పీ) కూడా ఉన్నది. పార్లమెంటులో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఎఫ్ఎల్పీ ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు రష్యాకు అనుకూలంగా ఉండటం వల్లనే వాటి గుర్తింపును రద్దు చేసినట్లు జెలెన్స్కీ ఆరోపించడం విశేషం.