ఇస్తాంబుల్: ఉక్రెయిన్, రష్యా దేశాలకు చెందిన ప్రతినిధులు శాంతి చర్చల కోసం ఇస్తాంబుల్లో సమావేశం అయ్యారు. ఆ ప్రతినిధులను ఉద్దేశిస్తూ ఇవాళ టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ మాట్లాడాడు. జెలెన్స్కీ, పుతిన్ తనకు విలువైన మిత్రులు అని తెలిపారు. చర్చల్లో ప్రగతి సాధిస్తే, ఆ ఇద్దరు నేతలు కలుసుకుంటారని, ఆ భేటీని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎర్డగాన్ చెప్పారు. రెండు వైపులా న్యాయపరమైన ఆందోళనలు ఉన్నాయని, కానీ చర్చల ద్వారా నిర్దిష్టమైన ఫలితాలను అందుకోవాలని ఆయన సూచించారు. రెండు దేశాల మధ్య శాంతి కుదరడం వల్ల ఎవరికీ నష్టం ఉండదన్నారు. చర్చల కోసం వచ్చిన ప్రతినిధులకు వెల్కమ్ చెప్పిన రీసెప్ తయిప్ ఎర్డగాన్.. ఈ చర్చలపై ఎంతో ఆధారపడి ఉన్నట్లు తెలిపారు. శాంతి ఏర్పడితే ఓడిపోయేది ఎవరూ లేరని, యుద్ధం కొనసాగితే ఎవరికీ లాభం ఉండదన్నారు. ఈ సమావేశంతో రెండు దేశాలకు, ఈ ప్రాంతానికి, మానవజాతికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు. విషాదాన్ని ఆపే శక్తి రెండు దేశాల చేతుల్లో ఉందన్నారు. ఇస్తాంబుల్లోని అధ్యక్షుడు ఎర్డగాన్ భవనం డోల్మాబాచేలో చర్చలు జరగుతున్నాయి.