Peace Talks Fail | రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య షరతులు, డిమాండ్లతో ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు తెలుస్తున్నది. రెండు దేశాల ప్రతినిధులు నాలుగు గంటల సేపు చర్చలు జరిపారు. చర్చల్లో రెండు దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. ఇరు వర్గాలు తమ వైఖరికే కట్టుబడినట్లు కనిపిస్తున్నది.
అమెరికా సారధ్యంలోని నాటో కూటమిలో చేరబోమని ఉక్రెయిన్ లిఖిత పూర్వకంగా రాసివ్వాలని రష్యా డిమాండ్ చేసింది. అలా లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే, సైన్యాన్ని ఉప సంహరిస్తామని చెప్పినట్లు సమాచారం. కానీ నాటో కూటమిలో చేరే విషయమై ఉక్రెయిన్ వెనక్కు తగ్గినట్లు కనిపించడం లేదు.తక్షణం యుద్ధాన్ని విరమించాలని రష్యాను ఉక్రెయిన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
అంతే కాదు సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. క్రిమియా నుంచి కూడా సైనిక బలగాలను ఉపసంహరించాలని పట్టుబట్టింది. నాటో కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధ పడటం వల్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహించారు. ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగారు.
లొంగిపోయే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చి చెప్పారు. చర్చల్లో ఐదుగురు రష్యా, ఆరుగురు ఉక్రెయిన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎటువంటి తీర్మానం చేయకుండా శాంతి చర్చలు ముగిశాయి.