మాడ్రిడ్: బ్రిటన్కు చెందిన బడ్జెట్ విమాన సంస్థ ఈజీ జెట్ ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ప్రతికూల వాతావరణం వల్ల టేకాఫ్ కష్టమని భావించిన పైలట్ 19 మంది ప్రయాణికులను దించేశారు. ఈ ఘటన స్పెయిన్లోని లాంజ్రోట్ విమానాశ్రయంలో జరిగింది.
విమానం స్పెయిన్ నుంచి బ్రిటన్ వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చిన్న రన్వే నేపథ్యంలో బరువైన విమానం టేకాఫ్ కష్టమని పైలట్ భావించారు. రాత్రి 9.45 గంటలకు టేకాఫ్ అవ్వాల్సిన విమానాన్ని రాత్రి 11.30 వరకు నిలిపేశాడు. కనీసం 20 మంది దిగిపోవాలని, 500 యూరోలు పారితోషికంగా ఇస్తామని చెప్పాడు. అయినా ఎవరూ ముందుకురాలేదు. దీంతో సిబ్బంది వారికి నచ్చజెప్పి తర్వాతి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేయగా, విమానం టేకాఫ్ అయ్యింది.