కాబూల్, సెప్టెంబర్ 8: అఫ్గానిస్థాన్లో మంగళవారం ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వం చట్టబద్ధమైంది కాదని ఆ దేశ జాతీయ ప్రతిఘటన దళం(ఎన్ఆర్ఎఫ్) ఆరోపించింది. తాలిబన్ల ప్రభుత్వానికి సమాంతరంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బుధవారం ప్రకటించింది. రాజకీయ నాయకులతో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఎన్ఆర్ఎఫ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ఎన్ఆర్ఎఫ్కు నేతృత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ ఈ ప్రకటనలో తెలిపారు. తాలిబన్ల ప్రభుత్వం అఫ్గానిస్థాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వానికి, భద్రతకు ముప్పు అని ఆయన విమర్శించారు. ఐరాస, అంతర్జాతీయ మానవహక్కుల సంఘం, యూరోపియన్ యూనియన్, సార్క్ లాంటి అంతర్జాతీయ సంస్థలు తాలిబన్లకు సహకరించవద్దని కోరారు.
మారణహోమాన్ని అడ్డుకోండి
పంజ్షీర్లో తాలిబన్లు మారణహోమాన్ని సృష్టిస్తున్నారని , ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం అంతా ఈ మారణహోమాన్ని అడ్డుకోవాలని ఎన్ఆర్ఎఫ్ కోరింది. పంజ్షీర్ పౌరులపై పగతో తాలిబన్లు దాడులు చేస్తున్నారని ఆరోపించింది. గడిచిన వారం రోజుల్లో ఎన్ఆర్ఎఫ్ బలగాల చేతిలో తమవారు చనిపోవడంతో తాలిబన్లు పంజ్షీర్ పౌరులను ఊచకోత కోస్తున్నారని విమర్శించింది. తాలిబన్లకు నిధులు అందించే విదేశీయుల ఖాతాలను స్తంభింపజేయాలని విజ్ఞప్తి చేసింది.
మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్డీలకు విలువలేదు: అఫ్గాన్ మంత్రి
మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్డీ డిగ్రీలకు ఈ రోజుల్లో విలువ లేదని అఫ్గాన్ విద్యాశాఖ మంత్రి షేక్ మౌల్వీ నూరుల్లాహ్ మునీర్ అన్నారు. ‘ప్రస్తుతం అధికారంలో ఉన్న ముల్లాలకు, తాలిబన్లకు కనీసం హైస్కూల్ సర్టిఫికెట్లు కూడా లేవు. కానీ వారు అందరి కన్నా గొప్పవారు’ అని వ్యాఖ్యానించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయనే విద్య ఎందుకూ కొరగాదని వ్యాఖ్యానిస్తున్న వీడియో వైరల్ అయింది. తాలిబన్ల పాలన ఎలా ఉండబోతున్నదో ఈ వీడియో చూస్తే తెలుస్తుందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
దమ్ముంటే కాల్చు..!
అదురు లేదు. బెదురు లేదు. తుపాకీ భయం లేదు. తాలిబన్ల మూర్ఖత్వాన్ని మించిన ధైర్యం. హక్కుల కోసం ప్రాణాలొడ్డి పోరాడే తెగువ. చంపుతావా.. ధైర్యం ఉంటే చంపు అన్నట్టుగా ఆమె సివంగిలా ముందుకు దూసుకువస్తుంటే ఉగ్రవాదే వెనుకడుగు వేశాడు. కాబూల్ వీధుల్లో మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఓ మహిళపై తాలిబన్ తుపాకీ ఎక్కుపెట్టగా ఆమె ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు నడిచివస్తున్న దృశ్యం. ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.