లండన్: తీవ్రమైన నొప్పులున్నా కూడా రోజులో పారాసిటమాల్ డోస్ నాలుగు గ్రాములు మించి ఉండకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి అధిక మొత్తంలో ఉన్నా, నిరంతరం ఈ ఔషధాన్ని వాడినా.. కాలేయం దెబ్బతినటం ఖాయమంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ సైంటిస్టుల అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎలుకలపై ప్రయోగాలు జరపగా, వాటి కాలేయం దెబ్బతినటం నిరూపణ అయ్యిందని సైంటిస్టులు తెలిపారు. ‘మానవుల, ఎలుకల కాలేయం, ఇతర అవయవాలపై పారాసిటమాల్ ప్రభావాన్ని సైంటిస్టులు అధ్యయనం చేశారు. కాలేయానికి, ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని ఔషధం దెబ్బతీస్తున్నది’ అని అధ్యయనం పేర్కొన్నది. కాలేయ కణజాల నిర్మాణమూ దెబ్బతింటుందని తెలిపింది.