Medical students : ఇరాన్ (Iran) కు, అమెరికా, ఇజ్రాయెల్ (US, Israel) కు మధ్య దాడులు ప్రతిదాడులు తీవ్రతరమయ్యాయి. దాంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు (Indian Students) తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇస్ఫహాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Isfahan University of Medical Sciences) పరిధిలో చదువుతున్న పలువురు విద్యార్థులు అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
తమను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు లేదా స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. అక్కడి పరిస్థితిపై విద్యార్థిని ఫాతిమా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఇక్కడ 25 నుంచి 30 మంది భారతీయ విద్యార్థులం చిక్కుకుపోయాం. మా చుట్టూ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి క్యాంపస్కు ఎంత దూరంలో జరుగుతున్నాయో తెలియకపోయినా, చాలా దగ్గరగా అనిపిస్తోంది. డార్మిటరీల్లో ఉన్నా మాకు రక్షణ ఉన్నట్లు అనిపించడం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
యూనివర్సిటీ పరీక్షలు, క్లాసుల కారణంగా తాము ముందుగానే భారత్కు రాలేకపోయామని ఆ విద్యార్ధిని చెప్పారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ.. గ్రాడ్యుయేషన్కు దగ్గరగా ఉన్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా ఆస్పత్రి విధులకు హాజరుకావాలని యూనివర్సిటీ యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని ఫాతిమా పేర్కొన్నారు. డార్మిటరీలను ఖాళీచేసి వేరే చోటికి వెళ్లాలని వేధిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
బయట షాపులు మూసివేయడం, ఆన్లైన్ డెలివరీలు నిలిచిపోవడంతో ఆహారం, నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం కారణంగా భారత్లోని తమ తల్లిదండ్రులతో మాట్లాడటం కష్టంగా మారిందని, వార్తలు చూసి వారు తమ గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని విద్యార్థులు చెప్పారు. పరిస్థితులు చక్కబడే వరకు భారత అధికారులు చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.