Sharda Peeth | పీవోకేలోని కశ్మీరీ పండిట్ల విశ్వాసానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి పురాతన దేవాలయం శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకున్నది. ఎల్ఓసీ సమీపంలోని నీలం నది ఒడ్డున ఉన్న ఆలయం స్థానంలో పాక్ సైన్యం కాఫీ హోమ్ను నిర్మించనున్నది. ఈ శారదా పీఠం ముజఫరాబాద్ నుంచి 140 కిలోమీటర్లు, కుప్వారా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని శారదా కమిటీ వ్యవస్థాపకుడు రవీంద్ర పండిట్ కోరారు. ఈ మేరకు కమిటీ నవంబర్ 30న ప్రధాని కార్యాలయానికి లేఖ రాసింది.
ఈ నెల 1న పీఎం కార్యాలయానికి లేఖ అందింది. శారదా పీఠం ఆలయంపై పాక్ సైన్యం దురాక్రమణకు పాల్పడడంపై జమ్మూ కశ్మీర్లోని హిందూ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. రెవెన్యూ రికార్డుల ప్రకారం శారదా పీఠం కాంప్లెక్స్లో 73 కెనాల్స్ విస్తీర్ణం ఉండగా.. ప్రస్తుతం ఆక్రమణ కారణంగా పది కెనాల్స్ మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం ఇక్కడ పాక్ సైన్యం సైతం చొరబాటుకు యత్నిస్తున్నది. ఈ క్రమంలో పాక్తో చర్చలు జరిపిన అవసరమైన చర్యలు తీసుకోవాలని రవీంద్ర పండిట్ ప్రధాని కార్యాలయాన్ని కోరారు. అలాగే శారదా పీఠం మరమ్మతు పనులు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.