Pakistan : స్వాతంత్రం తమ హక్కు అని, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి స్వాతంత్రం కోరుకుంటున్నామని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని పౌరులు నినదిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతకాలంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ప్రజలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు 27వ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. పీవోకేలో ఆందోళనలు చేస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నాయకుడు షౌకత్ నవాజ్ మీర్తోపాటు మరో 600 మంది ఉద్యమకారులను, పౌరహక్కుల నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది.
దీంతో వీరందరినీ విడుదల చేయాలని కోరుతూ జేఏఏసీ ఆధ్వర్యంలో మరింత భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో వేలాదిగా ఆందోళనకారులు నిరసన చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అక్రమంగా అరెస్టు చేసిన తమవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పాకిస్తాన్ పాలన నుంచి తమకు విముక్తి కావాలంటూ నిరన చేపట్టారు. లేకుంటే ఇండియాతో తమను మళ్లీ కలపాలని కోరుతున్నారు. ఇండియా నుంచి మానవతా సాయం, ఆహార సరఫరా కూడా అందుతుందని ఆందోళనకారులు అంటున్నారు. ఈ ఆందోళనల్లో పిల్లలు, యువత, మహిళలు సహా అందరూ పాల్గొంటున్నారు. ఇస్లామాబాద్ ప్రభుత్వం తమను ఇన్నాళ్లుగా దోపిడీకి గురి చేసిందని విమర్శించారు. స్వతంత్రం తమ హక్కు అని, తమకు స్వతంత్రం ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. తాము కోల్పోయిన స్వాతంత్య్రాన్ని వెనక్కి తీసుకుంటామన్నారు.
మరోవైపు ఆందోళనలపై పాక్ ప్రభుత్వం అణచివేసే చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున ఉద్యమకారులు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. భద్రతా దళాల నుంచి ఎటువంటి ప్రతిఘటనా లేకుండా.. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఆందోళనల్లో ముందు వరుసలో ఉంటున్నారు. ఇంకోవైపు ఆందోళనల్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పాక్ పోలీసులు, భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 58 మంది పౌరులు మరణించినట్లు అంచనా. అయితే, అంతకంటే ఎక్కువ మందే మృతులు ఉంటారని స్థానికులు అంటున్నారు. దాదాపు నెల రోజులుగా పీవోకేలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి.