ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan)లో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8న జరగాల్సిన సాధారణ ఎన్నికలను వాయిదా వేయాలని పాకిస్థాన్ సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. స్వతంత్ర సెనేటర్ దిలావర్ ఖాన్ ఈ తీర్మానాన్ని ఎగువ సభలో ప్రవేశపెట్టారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న చల్లని వాతావరణం, భద్రతాపరమైన సమస్యలు, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సాధారణ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపాదించారు. సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగి, పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. అయినప్పటికీ ఎన్నికల వాయిదాకు మెజారిటీ పార్టీలు మొగ్గుచూపాయి. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.
కాగా, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తప్పించడం, ఆయనను జైలుకు పంపడంతో పాకిస్థాన్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలను నిర్వహిస్తామన్న ప్రకటనకు కట్టుబడి ఉండాలని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ)ను ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరోవైపు కేవలం 14 మంది సభ్యులు హాజరైనప్పటికీ ఎన్నికల వాయిదా తీర్మానాన్ని పాక్ సెనేట్ ఆమోదించింది. పాకిస్థాన్లో రాజకీయ, ఆర్థిక అస్థిరతను ఇది మరింత పెంచుతుందని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్పై కూడా ఈ తీర్మానం ప్రభావం చూపింది. ఆ దేశ షేర్ మార్కెట్ 800 పాయింట్లకు పైగా పడిపోయింది.