Shahbaz Sharif | పాకిస్థాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు (Dissolve Parliament) చేయనున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందే దాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని ఈనెల 9న సిఫార్సు చేస్తానని ఆ దేశ ప్రధాన మంత్రి షెహజాబ్ షరీఫ్ తాజాగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ పై దేశాధ్యక్షుడు సంతకం చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దవుతుందని తెలిపారు.
ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (Pakistan Muslim League-Nawaz), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (Pakistan Peoples Party) కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలం ఆగస్టు 12న అర్ధరాత్రితో ముగియనుంది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీని రద్దు చేస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. దీంతో నిర్ణీత కాలానికి ముందే రద్దు చేయడం తమకు కలిసొస్తుందని పీఎంఎల్-ఎన్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్టు 9వ తేదీన నేషనల్ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్ ను అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి.. ప్రధాని షరీఫ్ పంపనున్నట్లు ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.
Also Read..
Tamannaah Bhatia | ఇప్పుడు బిజీగా ఉన్నా.. పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదంటున్న తమన్నా
Manipur Violence | మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస.. ముగ్గురు మృతి
Kulgam Encounter | కుల్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం