ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు వెంటనే గుర్తించాలని, లేనిపక్షంలో మరో 9/11 ఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్ఏ) సలహాదారు మొయిద్ యూసుఫ్ (Moeed Yusuf) హెచ్చరించారు. దీనిపై దుమారం చెలరేగడంతో, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. బ్రిటన్కు చెందిన ది సండే టైమ్స్ పత్రిక చీఫ్ ఫారిన్ కరస్పాండెంట్ క్రిస్టినా లాంబ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొయిద్ యూసుఫ్ ఈ మేరకు తీవ్రమైన పదజాలం వాడారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవడంతో.. క్రిస్టినా లాంబ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలా మాట్లాడ లేదని బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే, తన వద్ద ఇంటర్వ్యూ రికార్డింగ్ ఉన్నదని లాంబ్ స్పష్టం చేయడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
‘వర్క్ విత్ ది తాలిబాన్ ఆర్ రిపీట్ ది హర్రర్ ఆఫ్ ది 1990, వెస్ట్ టోల్డ్’ అనే శీర్షికతో మొయిద్ యూసుఫ్ ఇంటర్వ్యూ ది సండై టైమ్స్ మ్యాగజైన్లో ఆగస్ట్ 28 న ప్రచురితమైంది. క్రిస్టినా లాంబ్ బ్రిటన్లోనే కాకుండా ప్రపంచంలోనే ప్రముఖ పాత్రికేయుల్లో ఒకరిగా పరిగణించబడుతున్నారు. అనేక అవార్డులు అందుకున్న లాంబ్.. ప్రస్తుతం ది సండే టైమ్స్కి చీఫ్ కరస్పాండెంట్గా, అంతర్జాతీయ వ్యవహారాల బాధ్యురాలుగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వ్యవహరాలకు సంబంధించి లాంబ్ అనేక కథనాలు అందించారు.
మొయిద్ యూసుఫ్ హెచ్చరికలపై దుమారం చెలరేగింది. తనను తాను రక్షించుకునే ప్రయత్నాల్లో యూసుఫ్ మునిగిపోయారు. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు ఆయన కార్యాలయం ప్రయత్నించింది. మొయిద్ ప్రకటనను తప్పుగా పేర్కొన్నారని ఆ ప్రకటనలో తెలిపారు. ఆయన తాలిబాన్తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని మాత్రమే చెప్పాడని, ఇది జరుగకపోతే 1990 ల వంటి పరిస్థితి మళ్లీ తలెత్తవచ్చునని అన్నాడని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
అయితే, ఈ విషయం చాలా సున్నితమైనది కావడంతో లండన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూలో ఆరోపించిన వివాదాస్పద భాగాన్ని సరిదిద్దాలని లేదా తొలగించాలని రాయబార కార్యాలయం ది సండే టైమ్స్ యాజమాన్యాన్ని కోరుతూ అధికారిక లేఖను పంపింది. అయితే, పాకిస్తాన్ చేపట్టిన చర్యలు ది సండే టైమ్స్పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ప్రచురించిన ఇంటర్వ్యూ ఖచ్చితంగా సరైనదే అని, ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. మొయిద్ యూసుఫ్ చెప్పిన అన్ని విషయాలు రికార్డులో ఉన్నాయని క్రిస్టినా లాంబ్ స్పష్టం చేసింది.
పాకిస్తాన్లో శ్రీకృష్ణుడి ఆలయం ధ్వంసం
ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
ఇవి తినే 109 ఏండ్లు బతికా : జాన్ టిన్నిస్వుడ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..