PAK embassy for sale | ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం.. అందిన ప్రతీ ఒక్క వనరును సద్వినియోగం చేసుకుంటున్నది. ఇప్పటికే ప్రభుత్వ అధికారుల వాహనాల్లో కోత విధించిన ప్రభుత్వం.. పలు బహుమతులను కూడా విక్రయించింది. సౌదీ అరేబియా నుంచి ఆశించినంత ఆర్థిక సాయం అందలేదు. దాంతో ప్రభుత్వ ఖజానా నిండుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్తులను అమ్ముకునేందుకు సిద్ధపడింది. అమెరికాలోని ఎంబసీ కార్యాలయం ఆస్తులను పాకిస్తాన్ అమ్మకానికి పెట్టింది.
వాషింగ్టన్లోని దేశ రాయబార కార్యాలయంలోని రక్షణ విభాగం ఉన్న భవనాన్ని పాకిస్తాన్ అమ్మకానికి పెట్టగా.. మూడు బిడ్లు అందాయి. వీటిలో అత్యధికంగా 6.8 మిలియన్ డాలర్లకు బిడ్ దాఖలైంది. ఈ బిడ్ను జెవీష్ గ్రూప్ దాఖలు చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ భవనంలో ఒక ప్రార్థనా మందిరాన్ని (సినగోగ్-యూదుల ప్రార్థనాలయం) నిర్మించాలని జెవీష్ భావిస్తున్నట్లు వాషింగ్టన్లోని దౌత్య వర్గాలను ఉటంకిస్తూ డాన్ వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది. కాగా, 5 మిలియన్ డాలర్ల బిడ్ను భారతీయ రియల్టర్ ఒకరు దాఖలు చేయగా.. 4 మిలియన్ డాలర్ల బిడ్ పాకిస్తాన్ రియల్టర్ నుంచి వచ్చింది. ఇలాఉండగా, వాషింగ్టన్లోని పాక్ మూడు దౌత్య ఆస్తుల్లో ఒకటి అయిన ప్రతిష్ఠాత్మక ఆర్ స్ట్రీట్ ఎన్డబ్ల్యూ లోని భవనం కూడా ఉన్నట్లుగా దౌత్య కార్యాలయం వర్గాలు తెలిపాయని డాన్ పత్రిక పేర్కొన్నది.
ఇలాఉండగా, పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో న్యూయార్క్లోని రూజ్వెల్ట్ హోటల్ స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి ఆర్థిక సలహాదారును నియమించాలని ప్రైవేటీకరణ కమిషన్ను ప్రైవేటీకరణపై పాక్ క్యాబినెట్ కమిటీ సూచించింది. వాషింగ్టన్లోని ఎంబసీ అధికారులు ఈ భవనం విలువను అంచనా వేసేందుకు మదింపుదారుని సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ హోటల్ను అమ్మేందుకు పాకిస్తాన్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.