Imran Khan | పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వేర్వేరు కేసుల్లో మంగళవారం ఊరటనిచ్చింది. 2022 నాటి ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్ మార్చ్’ విధ్వంసం ఘటన కేసుల్లో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఇస్లామాబాద్లోని లోహి భైర్, సహలా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్ తరఫున న్యాయవాది నయీ పంజోథా వాదనలు వినిపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) నేతపై ఒకే రోజు అనేక కేసులు అక్రమంగా బనాయించారన్నారు. సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, సమాచారం ఇవ్వలేదన్నారు.
ఫిర్యాదుదారుడు పోలీస్స్టేషన్ ఇన్చార్జి అని.. కేసు నమోదు చేసే అధికారం ఆయనకు లేదని స్పష్టం చేశారు. ఇమ్రాన్ఖాన్పై దాఖలైన కేసుల్లో ఏ సాక్షి వాంగ్మూలం లేదని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్లోని రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఆయన తోషాఖానా, ఇద్దత్ (ఇస్లామేతర వివాహం), ప్రభుత్వ రహస్య పత్రాల లీక్ తదితర కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2022లో అధికారం కోల్పోయిన అనంతరం మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ‘లాంగ్ మార్చ్’ చేపట్టారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్పై దాడి జరిగింది.