ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఘోరం జరిగింది. ఓ 18 ఏండ్ల హిందూ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపారు. పూజా ఓద్ అనే యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. పూజా తీవ్రంగా ప్రతిఘటించడంతో.. చేసేదేమీ లేక ఆమెపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది.
పాకిస్తాన్లో ఈ ఘటన కొత్తదేం కాదు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని మానవ హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన పలువురిని బలవంతంగా అపహరించి, మత మార్పిడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ తరహా ఘటనలు చూస్తున్నామని స్పష్టం చేశారు.
మైనార్టీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలను రెగ్యులర్గా కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేసేలా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ మొత్తం జనాభాలో హిందూ కమ్యూనిటీ 1.60 శాతం ఉన్నట్లు ఆ దేశ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.