ఇస్లామాబాద్, మార్చి 14: పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. గత 48 గంటల్లో అఫ్ఘాన్లోని కునార్ ప్రాంతంపై పాక్ 270కు పైగా రాకెట్లు, ఫిరంగి గుండ్లను ప్రయోగించిందని సీఎన్ఎన్-న్యూస్ 18 తెలిపింది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న తూర్పు అఫ్ఘాన్ ప్రావిన్స్లోని అనేక జిల్లాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ ప్రారంభమైన తర్వాత ఇది అత్యంత తీవ్రమైన దాడుల్లో ఒకటిగా భావిస్తున్నారు. కాగా, కునార్లోని పలు ప్రాంతాపై దాడులు జరిగాయని అఫ్ఘాన్ ప్రతినిధి జియాఉర్రేహాన్ స్పిన్ఘర్ వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన చెప్పారు. మిలిటెంట్ స్థావరాల నాశనం పేరుతో గత వారం రోజులుగా పాకిస్థాన్ వాయు సేనలు అఫ్ఘాన్లోని పలు ప్రాంతాపై విస్తృతంగా దాడులు చేస్తున్నాయి. పాక్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన అఫ్ఘాన్ తాలిబన్, తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) మిలిటెంట్ గ్రూపుల అంతానికి తాము దాడులు నిర్వహిస్తున్నామని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ తెలిపింది. కాగా, పాక్ వాదనను తిరస్కరించిన అఫ్ఘాన్, తమ దేశంలోని అమాయక పౌరులను పాకిస్థాన్ చంపుతున్నదని విమర్శించింది. పాక్ మిలిటరీ కేంద్రాల లక్ష్యంగా తాము దాడులు జరిపినట్టు పేర్కొన్నది.
వార్ ఎఫెక్ట్.. పాక్ ఉద్యోగుల జీతాల్లో కోత
ఇరాన్ యుద్ధం, చమురు సంక్షోభం పాకిస్థాన్ను అతలాకుతలం చేస్తున్నాయి. పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ప్రధాని షెహబాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ యాజమాన్యం, స్వతంత్ర సంస్థల్లో ఉద్యోగుల జీతాల్లో 5 నుంచి 30 శాతం వరకు కోతలు విధిస్తున్నట్టు ప్రధాని కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే రెండు నెలలపాటు క్యాబినెట్ సభ్యులు, ఇతర మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల జీతాలను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్నట్టు తెలిపింది. మంత్రులు, ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలపై, ప్రభుత్వ సంస్థల్లో కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. ఇరాన్ యుద్ధం మూడో వారానికి చేరిందని, ఇప్పటికే దీని ప్రభావం పాక్పై ఉందని ప్రధాని షెహబాజ్ ప్రకటించారు. తాజాగా ఆర్థిక పర్యవసనాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాల ఇంధన వ్యయంలో 50% కోత విధించారు.