ఇస్లామాబాద్ : ఆర్ధిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న క్రమంలో ఆర్ధిక మంత్రి ఇషాక్ దర్ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాకిస్తాన్ అభివృద్ధి, శ్రేయస్సుకు అల్లాదే బాధ్యతని ఇషాక్ వ్యాఖ్యానించారు. ఇస్లాం పేరుతో ఏర్పడిన దేశం పాకిస్తాన్ ఒక్కటేనని, పాకిస్తాన్ శ్రేయస్సు, అభివృద్ధి బాధ్యత అల్లా చూసుకుంటాడని ఈ వీడియోలో పాక్ ఆర్ధిక మంత్రి వ్యాఖ్యానించారు.
ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)నేత మాట్లాడుతూ ఇస్లాం పేరిట ఏర్పడిన దేశం కావడంతో పాకిస్తాన్ పురోగతి సాధిస్తుందనే విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్ను అల్లా సృష్టిస్తే ఆయనే ఈ దేశాన్ని కాపాడుతూ అభివృద్ధి పధంలో పయనించేలా చేస్తాడని అన్నారు. దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరిచేందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతున్నదని చెప్పారు.
పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఐదేండ్ల కిందట మొదలైన డ్రామాతోనే దేశానికి దుస్ధితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు పరిస్ధితిని చక్కదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. పాక్లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం 21-23 శాతం ఉండటం సహా పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ద్రవ్య లోటు జులై-అక్టోబర్ కాలానికి ఏకంగా 115 శాతానికి ఎగబాకింది.
అణ్వస్త్ర దేశమైన పాకిస్తాన్ ఇతరులను ఆర్ధిక సాయం కోసం అర్ధించడం సిగ్గుచేటని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంతకుముందు వ్యాఖ్యానించారు. తీవ్ర నగదు కొరతతో ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు పొరుగు దేశాల నుంచి సాయం కోరడం తనకు ఇబ్బందికరంగా ఉందని, ఇది శాశ్వత పరిష్కారం కూడా కాదని ఆయన చెప్పుకొచ్చారు.