Pakistan @ Debt trap | తీవ్రంగా బలహీనపడిన ఆర్థిక పరిస్థితులతో పాకిస్థాన్ సతమతమవుతున్నది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రూ.24 వేల కోట్ల సాయం కోసం తోటి దేశాన్ని పాక్ అభ్యర్థిస్తున్నది. రెండు, మూడు వారాల్లో ఈ సాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలను జియో న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. అయితే, తోటి దేశం ఎవరనేది మాత్రం బయటపెట్టలేదు. పాకిస్తాన్ విదేశీ నిల్వలు రూ.61 వేల కోట్లకు చేరుకున్నాయని, తమ భాగస్వామ్య దేశం సాయంతో దీన్ని రూ.24 కోట్లకు పెంచుతామని ఇంటర్వ్యూలో చెప్పారు. ఐఎంఎప్ పట్ల అసంతృప్తిని వెల్లగక్కిన ఆయన.. రుణ సమీక్షలో ఐఎంఎఫ్ జాప్యం చేస్తున్నదని ఆరోపించారు.
అవసరమైన ప్రక్రియ పూర్తయినప్పటికీ రుణ సమీక్షలో జాప్యం జరుగుతున్నదని పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ విచారం వ్యక్తం చేశారు. ఇలా జాప్యం చేయడంలో ఎలాంటి అర్థం లేదన్నారు. ఐఎంఎఫ్ ఎదుట అడుక్కోవడం ఇష్టం లేదని కూడా చెప్పాడు. నిజానికి, దివాలా తీసిన తర్వాత పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నుంచి రూ.48 వేల కోట్ల బెయిలవుట్ ప్యాకేజీ అందుతుంది. ఇందులో ఈ ఏడాది రూ.8 వేల కోట్లు చేరాయి.
కాగా, ఓ వైపు ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ నిధులు రాబట్టుకునేందుకు పాకిస్తాన్ సమయం తీసుకుంటుంటే.. మరోవైపు విదేశాల నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి వస్తున్నది. 12 నెలల్లోగా పాకిస్థాన్ విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సెక్యూరిటీస్ సంస్థ ఆప్టిమస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పేర్కొన్నట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొన్నది. విదేశీ, పాత రుణాలతో కలిపి మొత్తం రూ.21 లక్షల కోట్లు పాకిస్తాన్ చెల్లించాల్సి ఉన్నది. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న విదేశీ మారకద్రవ్యం పాకిస్తాన్ను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఎక్కువ రుణాలు తీసుకోనవసరం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూనే.. నానాటికీ పెరుగుతున్న దిగుమతులను అదుపులో ఉంచేందుకు రకరకాల వ్యూహాలను అవలంబిస్తున్నారు.