Pak Army | ఇస్లామాబాద్: పాకిస్థాన్లో అన్నీ తానే అయి వ్యవహరించే సైన్యం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వ్యవసాయ రంగంలోకి దిగుతున్నది. ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న దాదాపు 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని సైన్యం కౌలుకు తీసుకోబోతున్నది. దీనిలో గోధుమలు, పత్తి, చెరకు, కూరగాయలు, పండ్లను సాగు చేస్తుంది.
వీటిని అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం సొమ్మును వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయిస్తుంది. మిగిలిన సొమ్మును సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయి. పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సైన్యం చెప్తున్నది. అయితే సైన్యం గ్రామీణ పేదల హక్కులను మరింత ఉల్లంఘించబోతున్నదనే విమర్శలు కూడా వస్తున్నాయి.