Pakistan : పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 24 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం, బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టాలోని చమాన్ పాతక్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న రైలు అక్కడి సిగ్నల్ దాటుతుండగా, పేలుడు పదార్థాలతో ఉన్న ఒక కార్ ట్రాక్పైకి దూసుకొచ్చి, రైలును ఢీకొని పేలిపోయింది.
ఈ ఘటనలో 24 మంది మరణించగా, 50 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా పాక్ ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఇది ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి రైల్వే స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన పలు కార్లు దెబ్బతిన్నాయి. రైలు బోగి కూడా ధ్వంసమైంది. పేలుడు తీవ్రతతో వాహనాలకు చెందిన గ్లాస్లు, వాహన భాగాలు ఎగిరిపోయి సమీపంలోని బిల్డింగ్లపై పడ్డాయి. పేలుడు జరగగానే స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఘటన సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనతో అధికారులు క్వెట్టాలోని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేసి, అందరూ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావొద్దని, ప్రమాదం జరిగిన ప్రదేశానికి రావొద్దని ఆదేశించారు.