Imran Khan | పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై ఆ దేశ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి నిన్న పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎమ్) చీఫ్ మౌలానా ఫజ్లర్ రెహ్మాన్.. ఇమ్రాన్ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని చోట్ల కాల్చారు..? ఎన్ని తూటాలు తగిలాయంటూ..? ప్రశ్నించారు.
తాజాగా ఈ ఘటనపై ఆ దేశ ఇంటీరియర్ మినిస్టర్ రానా సనావుల్లా స్పందించారు. ఇమ్రాన్ చెబుతున్నట్లు ఆయనకు నాలుగు తూటాలు తగల్లేదన్నారు. నాలుగు తూటాలు తగిలినట్లు ఇమ్రాన్ నిరూపిస్తే… తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కాల్పుల ఘటనపై విచారణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్తో పాక్ పంజాబ్లోని వజీరాబాద్ అల్లావాలాచౌక్లో ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసింగించేందుకు ఇమ్రాన్ కంటెయినర్పైకి ఎక్కి నిలబడిన సమయంలో.. ఓ దుండగుడు ఇమ్రాన్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన కుడి కాలికి నాలుగు తూటాలు తగిలినట్లు ఇమ్రాన్ తెలిపారు. ఇదే సమయంలో తనను చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు.