ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో విద్యుత్ సంక్షోభం తీవ్రమవడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని పాక్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (ఎన్ఐటీబీ) హెచ్చరించింది. దేశవ్యాప్తగా గంటల తరబడి విద్యుత్ కోతలు వెంటాడుతుండటంతో టెలికాం ఆపరేటర్ల సేవలపై ప్రభావం పడుతోందని, దీంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను మూసివేస్తామని టెలికాం ఆపరేటర్లు చెబుతున్నారని ఎన్ఐటీబీ ట్విట్టర్లో పేర్కొంది. జులైలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంటుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు.
దేశ అవసరాలకు సరిపడా ఎల్ఎన్జీ సరఫరాలు ఉండటం లేదని, ఈ పరిస్ధితిని చక్కదిద్దేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. గ్యాస్ సరఫరాలకు సంబంధించిన ఒప్పందం అంగీకరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో పాకిస్తాన్ను విద్యుత్ సంక్షోభం వెంటాడుతోంది. మరోవైపు విద్యుత్ వినిమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను తగ్గంచడంతో పాటు కరాచీ సహా పలు నగరాల్లో ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్ను త్వరగా మూసివేయాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది.
ఇక మూడేండ్ల నుంచి పదేండ్ల వరకూ ఎల్ఎన్జీ సరఫరాల కోసం ఖతార్తో ఒప్పందం చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని ఆర్ధిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ తెలిపారు. నిత్యావసరాల ధరలు మండుతుండటంతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆరేండ్ల గరిష్టస్ధాయిలో జులైలో రెండంకెలకు చేరుకుంది.