జెరుసలాం: ఇరాన్పై మరో రెండు వారాల పాటు దాడులు కొనసాగించనున్నట్లు ఇవాళ ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొన్నది. ఆ సమయంలో ఇరాన్లోని వేలాది ప్రాంతాలను టార్గెట్ చేయనున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. ఇరాన్ ప్రభుత్వాన్ని, ఆ దేశ సైన్యాన్ని వ్యవస్థీకృతంగా కూల్చడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ పేర్కొన్నది. ఇరాన్పై భీకర స్థాయిలో బాంబు దాడులు జరపాలని ప్లానింగ్ ఎప్పుడో చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. అయితే బుధవారం వరకు.. ఇజ్రాయెలీ వైమానిక దళం( Israeli Air Force) ఇరాన్పై సుమారు 5000 బాంబులను జారవిడిచినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇజ్రాయల్ వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానాలు ఇరాన్లోకి చొచ్చుకెళ్లి దాడులు కొనసాగిస్తున్నట్లు మిలిటరీ చెప్పింది.
ప్రస్తుతం దాడులు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ఇరానీ సైనికులు మృతిచెందినట్లు సీనియర్ ఇజ్రాయిలీ వైమానిక దళ ఆఫీసర్ తెలిపారు. గత రెండు రోజుల నుంచి వేల సంఖ్యలో ఇరానీ దళ సభ్యులను చంపేశామని కల్నల్ అలెప్ తెలిపారు. రమాత్ డేవిడ్ ఎయిర్బేస్ కమాండర్గా పనిచేస్తున్న కల్నల్ అలెప్.. ప్రత్యక్షంగా ఇరాన్ అటాక్లో పాల్గొన్నట్లు చెప్పారు. తూర్పు టెహ్రాన్లోని మిలిటరీ కాంపౌండ్పై జరిగిన భారీ దాడిలో తాను కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. తనతో పాటు అనేక యుద్ధ విమానాలు చాలా స్వేచ్ఛగా.. టెహ్రాన్పై వందల సంఖ్యలో టన్నుల కొద్ది బాంబులను జారవిడిచినట్లు చెప్పారు.
ఈస్ట్రన్ టెహ్రాన్లో ఉన్న మిలిటరీ కాంపౌండ్పై సుమారు 100 యుద్ధ విమానాలతో దాడి చేసినట్లు ఆయన తెలిపారు. ఆ మిలిటరీ సెంటర్పై సుమారు 250 బాంబులు ఫైర్ చేసినట్లు చెప్పారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన హెడ్క్వార్టర్స్ను పేల్చివేసినట్లు ఆయన తెలిపారు. ఐఆర్జీసీ కుద్స్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, బసిజీ పారామిలిటరీ ఫోర్స్, ఇరాన్ సైబర్ యూనిట్ను కూడా టార్గెట్ చేసినట్లు చెప్పారు. ఎఫ్-35ఐ ఫైటర్ జెట్తో కెర్మాన్షా ఏరియాలో ఉన్న ఇరానియన్ బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్ను ధ్వంసం చేసిట్లు తెలిపారు. మిస్సైల్ లాంచ్ సైట్లతో పాటు మిస్సైల్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
టెహ్రాన్లోని మెహ్రాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, డిటెక్షన్ సిస్టమ్లను పేల్చినట్లు ఐఏఎఫ్ అధికారి చెప్పారు. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు 11 సార్లు ఓ ఉప్పెనలా టెహ్రాన్పై వైమానిక దాడులు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇజ్రాయల్ వైమానిక దళం తన దాడుల కోసం ఎక్కువగా అమెరికాపై ఆధారపడుతోంది. అమెరికా మిలిటరీ వద్ద ఏరియల్ రీఫుయలింగ్ సామర్థ్యంగా ఎక్కువగా ఉన్న కారణంగా.. ఇజ్రాయిలీ వైమాని దళం ఆ సేవల్ని వినియోగించుకుంటోంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అమెరికాకు చెందిన రీఫుయలింగ్ ట్యాంకర్లను ఇజ్రాయల్ సమీకరించుకున్నది.