కీవ్: రష్యా దాడితో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. అయితే ఆ ఆక్రమణ వల్ల భారీ సంఖ్యలో ఉక్రేనియన్లు దేశం విడిచి వెళ్తున్నారు. యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 48 లక్షల మంది ఉక్రెయిన్ చిన్నారులు శరణార్థులుగా మారినట్లు యూఎన్ చెప్పింది. ఉక్రెయిన్లో సుమారు 75 లక్షల మంది చిన్నారులు ఉండి ఉంటారని, దాంట్లో 48 లక్షల మంది చిన్నాభిన్నం అయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. రాబోయే రోజులు ఉక్రెయిన్కు కీలకమైనవని పశ్చిమ దేశాలు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాయి. ఇక తూర్పు ప్రాంతాలపై వేల సంఖ్యలో సైనికులు రష్యా మోహరిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆగాలంటే పుతిన్, జెలెన్స్కీ మధ్య నేరుగా చర్చలు జరగాలని భారత ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్లో ఉన్న మూడవ వంత మంది చిన్నారులు తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు యునిసెఫ్ పేర్కొన్నది. ఈ యుద్ధంలో 142 మంది చిన్నారులు మృతిచెందినట్లు గుర్తించారు. 48 లక్షల మంది చిన్నారులు ఇండ్లు వదిలి వెళ్లారని, గడిచిన 31 ఏండ్లలో ఇలాంటి మానవ సంక్షోభాన్ని చూడలేదని యునిసెప్ డైరెక్టర్ మాన్యువల్ ఫౌంటేన్ తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో 32 లక్షల మంది చిన్నారులు తమ ఇండ్లల్లోనే ఉన్నారని, వారిలో సగం మందికి ఆహారం అందడం లేదన్నారు. మారియపోల్, ఖేర్సన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు.