BRICS Summit : ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు శుక్రవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు తమ ప్రధాని తారిక్ రహమాన్కు ఆహ్వానం అందలేదని బంగ్లాదేశ్ తెలిపింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హుమాయున్ కబిర్ గురువారం వెల్లడించారు. బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం లేనందున తమ ప్రధాని ఇండియా వెళ్లడం లేదని ఆయన తెలిపారు.
బిమ్స్టెక్ కూటమికి ప్రస్తుతం బంగ్లాదేశ్ అధ్యక్షత వహిస్తున్నందున ఈ హోదాలో బంగ్లాకు ప్రత్యేక ఆహ్వానం అందిందన్న ప్రచారాన్ని హుమాయున్ కబిర్ కొట్టిపారేశారు. తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. నిజానికి బ్రిక్స్ కూటమిలో బంగ్లాదేశ్కు సభ్యత్వం లేదు. అందువల్లే ఇండియా నుంచి ఆహ్వానం అందలేదు. ఈ అంశంపై అక్కడి మీడియా హుమాయున్ను ప్రశ్నించగా.. ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
మేం ఎలా వెళ్తాం..? బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి ఎవరికైనా ఆహ్వానం అందిందా..? మా దేశ ప్రధానికి ఆహ్వానం అందిందని ఎవరు చెప్పారు..? బిమ్స్టెక్ అధ్యక్షతన ఆహ్వానం అందిందా.. అలా అయితే, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని హుమాయున్ సమాధానం ఇచ్చారు. అయితే, ఈ సదస్సుకు బంగ్లాదేశ్ తరఫున ఒక ప్రతినిధి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తమ ప్రధాని రహమాన్ ఇండియా పర్యటనపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆయన ఇండియాలో పర్యటిస్తారని హుమాయున్ వెల్లడించారు.
ఇక, బిమ్స్టెక్ కూటమికి ఈసారి బంగ్లాదేశ్ అధ్యక్షత వహిస్తోంది. గత ఏడాది ఏప్రిల్లో బంగ్లాదేశ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. దీని కాల వ్యవధి రెండు సంవత్సరాలు. ఈ కూటమిలో ఇండియాతోపాటు, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్, థాయ్లాండ్ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనుంది.