PAK vs AFG : ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు గురువారం పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ (Pakistan-Afghanistan) దేశాల మధ్య కీలకమైన శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల ప్రారంభానికి ముందే పాకిస్థాన్ (Pakistan) రక్షణమంత్రి (Defence minister) ఖవాజా ఆసిఫ్ (Khawaza Asif) కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి చర్చలు ఫలించకపోతే తాలిబన్ల (Talibans) తో యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
శాంతిచర్చలు విఫలమైతే ఇరుదేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయన్నారు. ‘మా వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారన్న దాన్ని బట్టి మా ప్రతిస్పందన కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుంది’ అని ఖవాజా వ్యాఖ్యానించారు. మిలిటెంట్లకు కాబూల్ ఆశ్రయం కల్పిస్తోందని, సీమాంతర దాడులను ప్రోత్సహిస్తోందని పాక్ మంత్రి దుయ్యబట్టారు.
అయితే ఖవాజా వ్యాఖ్యలను అఫ్గాన్ తీవ్రంగా ఖండించింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది. కాగా టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా అఫ్గాన్-పాక్ మధ్య నేడు మూడోవిడత శాంతి చర్చలు జరగనున్నాయి. దీనికి ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అంతకుముందు దోహా, ఇస్తాంబుల్లో రెండు విడతల్లో జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు.
అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు.. పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓరక్జాయ్ జిల్లాలో ఇటీవల దాడులు చేశారు. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ రాజధాని కాబుల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాకిస్థాన్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది.
ఈ క్రమంలోనే తాలిబన్ సైన్యం పాకిస్థాన్పై దాడులకు దిగింది. దాంతో పాకిస్థాన్ ఎదురుదాడులు జరిపింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.