UAE decision | యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఉద్యోగులను ప్రోత్సహించేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిపాటు సెలవు తీసుకోవచ్చు. వీరికి ఈ కాలంలో సగం జీతం అందుతుంది. ఈ కాన్సెప్ట్ను తొలిసారిగా యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జూలై నెలలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిని వ్యాపారాల్లో ప్రోత్సహించడమే ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. యూఏఈ వాసులు వ్యాపారాలు చేయడం ద్వారా స్థానికంగా కొత్త ఉద్యోగాలను కల్పించే వీలుంటుంది. అలాగే ఆర్థికంగా పరిపుష్టిని పొందగలుగుతారని యూఏఈ అధికారులు భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నిర్ణయం మరే దేశంలో తీసుకోలేదని యూఏఈ అధికారిక వార్తా సంస్థ, ఖలీజ్ టైమ్స్ పేర్కొన్నాయి. యూఏఈ యువతరం ప్రభుత్వం ప్రవేశపెట్టే వాణిజ్య ప్రయోజన పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునన్నది షేక్ మొహమ్మద్ కోరిక. వ్యాపారం కోసం ఏడాది సెలవు మంజూరును ఆ ఉద్యోగి శాఖాధిపతి నిర్ణయిస్తారు. ఇందుకు కొన్ని షరతులు కూడా విధించారు. సెలవు కోరుకునే వారు ముందుగా వెబ్సైట్లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే దరఖాస్తు పెట్టుకోవాలి.
గత ఏడాదిలో ఉద్యోగులకు బహుమతులు ప్రకటించిన ప్రభుత్వం.. జనవరి 1 నుంచి పని గంటలను నాలుగున్నర రోజులకు కుదించారు. మిగతా రెండున్నర రోజులు సెలవు దినాలు. ఇలా ప్రకటించిన ప్రభుత్వం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. ఈ ప్రభుత్వ ఈ ప్రకటనతో దుబాయ్, అబుదాబిలోని ఉద్యోగులు చాలా సంతోషిస్తున్నారు. 1971 నుంచి 1999 వరకు దేశంలో 6 పని దినాలు ఉండేవి. 1999లో 5 రోజులకు, ఇప్పుడు నాలుగున్నర రోజులకు మార్చారు.