అంకారా: టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న ఓ చర్చిలో (Church) దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇస్తాబుల్లోని (Istanbul) సరియార్లో ఉన్న సాంటా మారియా క్యాథలిక్ చర్చిలో ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చర్చిలోకి ప్రవేశించిన సాయుధులైన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులకు (Shooting) తెగబడ్డారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆదివారం ఉదయం 11.40 (స్థానిక కాలమానం) జరిగిందని టర్కీ అంతర్గత వ్యవహారా శాఖ మంత్రి అలీ యెర్లికాయా వెల్లడించారు.
దుండగులు మాస్క్ ధరించి వచ్చారని చెప్పారు. వారిలో ఒకరిని తజకిస్థాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించామని, మరొకరు రష్యన్ అని తెలిపారు. దుండగుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశామని, ఇప్పవరకు 47 మంది అనుమానితులను అరెస్టు చేశామన్నారు. 30కిపైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. కాగా, దాడి ఘటనను న్యాయ శాఖ మంత్రి యిల్మజ్ టన్స్ ఖండించారు. దాడికి పాల్పడినవారిని వీలైనంత తొందరలో పట్టుకుంటామని చెప్పారు.