Pervez Musharraf | పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) (Pervez Musharraf) ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్తో బాధపడుతున్న ఆయన.. దుబాయ్లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ముషారఫ్కు చెందిన పలు ఆసక్తికర విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అటల్ బిహారీ వాజ్పేయీ (Atal Bihari Vajpayee) ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 2001లో ఆగ్రా సమ్మిట్ కోసం ముషారఫ్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో చారిత్రక పాలరాతి కట్టడం తాజ్ మహల్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తాజ్ అందాలను చూసి మంత్రముగ్ధుడైన ముషారఫ్.. మొదటిగా ‘తాజ్ మహల్ను ఎవరు డిజైన్ చేశారు..?’ అని అడిగారట. ఈ విషయాలను ఆర్కియాలజిస్ట్ కేకే ముహమ్మద్ తాజాగా గుర్తు చేసుకున్నారు.
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆగ్రా సర్కిల్లో ముహమ్మద్ పని చేసే వారు. ముషారఫ్ పర్యటన సందర్భంగా ఆయనకు ముహమ్మద్ గైడ్గా వ్యవహరించారు. ముషారఫ్ మృతి నేపథ్యంలో ఆ నాటి జ్ఞాపకాలను ముహమ్మద్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ‘తాజ్ మహల్ను చూసిన క్షణంలోనే దానితో ఆయన ప్రేమలో పడ్డారు. తాజ్ను చూసిన వెంటనే ముషారఫ్ అడిగిన మొదటి ప్రశ్న ‘దీన్ని ఎవరు డిజైన్ చేశారు?’ అని. షాజహాన్ పేరు నేను చెబుతానని ఆయన ఊహించి ఉండొచ్చు. కానీ, తాజ్ మహల్ డిజైనర్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. పాకిస్థాన్లోని లాహోర్కు చెందిన వ్యక్తి అని నేను చెప్పా’ అని ముహమ్మద్ చెప్పుకొచ్చారు.
అనంతరం ‘తాజ్ మహల్ను సందర్శించేందుకు ఉత్తమ సమయం ఏది?’ అని ముషారఫ్ అడిగారని.. వర్షం పడేముందు.. సూర్యాస్తమయం సమయంలో చూడటానికి చాలా బాగుంటుందని చెప్పినట్లు ముహమ్మద్ తెలిపారు. ‘షెడ్యూల్ ప్రకారం ముషారఫ్ తాజ్ వద్ద 45 నిమిషాలు గడపాల్సింది. అయితే గంట సేపు అక్కడే గడిపారు. తాజ్ అందాలను చూసి మైమరచిపోయారు’ అని ముహమ్మద్ వివరించారు.