న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఢిల్లీలోని సర్ గంగారాం దవాఖానలో ఆక్సిజన్ అందక ఒక్కరోజే 25 మంది కరోనా రోగులు చనిపోయారు. 60 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రాణవాయువు లేక ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గంగారాం దవాఖానలో ఆక్సిజన్ అయిపోవచ్చిందని, కొన్ని గంటలే వస్తుందని వైద్యులు గురువారం రాత్రే అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆక్సిజన్ రాలేదు. దవాఖానలో 500 మందికిపైగా కరోనా రోగులు ఉన్నారు. ఉన్న ఆక్సిజన్ను అందరికీ సరిపెట్టడానికి వైద్యులు తక్కువ ఒత్తిడితో ఆక్సిజన్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో ‘హై ఫ్లో’ ఆక్సిజన్ అవసరమైనవారు చనిపోయినట్టు సమాచారం. అయితే దవాఖానలో రోగులకు సరిపోయేంత ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దవాఖానలో ఆక్సిజన్ నిల్వలను పెంచడానికి ట్యాంకర్ను ఉదయం 9.20 గంటలకే పంపించామని పేర్కొన్నాయి. మరోవైపు, మధ్యప్రదేశ్లో గ్యాలక్సీ దవాఖానలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు. గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
ఢిల్లీలోని ఆరు ప్రైవేట్ దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా నిండుకొన్నాయని కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది. తమకు ఆక్సిజన్ను సరఫరా చేయాలని ఐనాక్స్ సంస్థను ఆదేశించాల్సిందిగా సరోజ్ సూపర్ స్పెషాటిటీ దవాఖాన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వీటితో పాటు హోలీ ఫ్యామిలీ దవాఖానలో కూడా ఆక్సిజన్ అయిపోతున్నదని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా, ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల ద్వారా ఢిల్లీకి ఆక్సిజన్ను సరఫరా చేయాలని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరినట్టు రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ శుక్రవారం తెలిపారు.
హర్యానాలో పానిపట్ నుంచి సిర్సాకు ద్రవ ఆక్సిజన్తో వెళ్తున్న ట్యాంకర్ జాడ తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఆక్సిజన్ నింపుకొని బయల్దేరిన ట్యాంకర్ గమ్యానికి చేరుకోకపోవడంతో సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ ప్రభుత్వమే ఆక్సిజన్ను దొంగిలించి ఉంటుందని హర్యానా మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు.
బెంగాల్లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను ఇతర రాష్ర్టాలకు తరలించవద్దని ఆ రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. వివిధ రాష్ర్టాలకు ఆక్సిజన్ కోటా కేటాయింపులో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బెంగాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఆక్సిజన్కు డిమాండ్ ఏర్పడిందని, బెంగాల్లో తయారయ్యే ఆక్సిజన్ను బెంగాల్కే కేటాయించాలని కోరింది.