కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని పంజ్షీర్ను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అయితే, నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (ఎన్ఆర్ఎఫ్) దీనిని ఖండించింది. తాలిబన్లపై తమ పోరాటం కొనసాగుతున్నదని తెలిపింది. తమ నేత, సోదరుడు అహ్మద్ మసౌద్ సురక్షితంగా ఉన్నారని ఎన్ఆర్ఎఫ్ ప్రతినిధి అలీ నాజరీ తెలిపారు. తమ ప్రజలకు ఆయన త్వరలో సందేశం ఇస్తారని ట్వీట్ చేశారు. కాగా, అహ్మద్ మసౌద్, అమ్రుల్లా సలేహ్ ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు. పంజ్షీర్పై తాలిబన్ల దాడిని ఇరాన్ ఖండించింది. అక్కడి నుంచి వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.
మరోవైపు కొత్త ప్రభుత్వాన్ని త్వరలో ప్రకటిస్తామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సోమవారం తెలిపారు. ప్రభుత్వంతో విలీనం కావాలని మాజీ ఆఫ్ఘన్ దళాలను కోరారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే తీవ్రంగా దెబ్బతిస్తామని హెచ్చరించారు.