ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un).. ప్రభుత్వ ఉన్నతాధికారులు, మిలిటరీ అధికారులకు కొత్త స్నైపర్ రైఫిళ్లను బహూకరించారు. ఇటీవల వారం రోజుల పాటు అధికార పార్టీ సంబరాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ రైఫిళ్లను అందించినట్లు తెలుస్తోంది. మరో వైపు కిమ్ జాంగ్ టీనేజ్ కుమార్తె ఓ షూటింగ్ రేంజ్లో కొత్త తరహా రైఫిళ్లతో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్థానిక మీడియా రిలీజ్ చేసింది. ఉత్తర కొరియా భవిష్యత్తు నేతగా తన కుమార్తెను కిమ్ తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ పార్టీ, మిలిటరీ అధికారులకు శుక్రవారం కిమ్ రైఫిళ్లను అందజేశారు.గత పార్టీ సమావేశాలు జరిగి అయిదేళ్లు అవుతోందని, తనపై విశ్వాసం చూపించిన వారికి కృతజ్ఞతగా రైఫిళ్లను బహూకరించినట్లు తెలుస్తోంది. కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ అఫైర్స్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆమెకు కీలకమైన పదవి ఇవ్వడంతో.. పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు పరిపాలనా విభాగంలో ముఖ్య భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయి. రైఫిల్ టెస్టింగ్ సమయంలో కిమ్ కుమార్తె కిమ్ జూ యే అక్కడే ఉన్నారు. 13 ఏళ్ల ఆ అమ్మాయి ఇటీవల తండ్రితో కలిసి అనేక కార్యక్రమాలకు హాజరైంది. గత సెప్టెంబర్లో బీజింగ్ ట్రిప్కు కూడా వెళ్లిందామె.