Kim Jong Un : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా ఆయన కూతురు కిమ్ జు యే ను ఎంపిక చేసినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ విషయాన్ని కిమ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, కిమ్ తన కుమార్తెనే దేశాధినేతగా నిర్ణయించారని దక్షిణ కొరియాకు చెందిన నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్’ ప్రకటించింది. ఈ అంశాన్ని దక్షిణ కొరియా తన దేశంలోని చట్టసభల నేతలకు తెలిపింది.
ఉత్తర కొరియాలో ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే కాంగ్రెస్ సమావేశం ఈ నెల చివరిలో జరగనుంది. ఈ నేపథ్యంలో దేశానికి కొత్త నాయకత్వం ఎవరూ అనే అంశంపై చర్చ జరుగుతుండగా.. అనేక పేర్లను పరిశీలించిన కిమ్ తన కూతురును భవిష్యత్ నాయకురాలిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు ఈ అంశంపై తగిన శిక్షణ, అవగాహన కల్పిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికి మూడు తరాలుగా కిమ్ కుటుంబం చేతిలోనే ఉత్తర కొరియా నాయకత్వం కొనసాగుతోంది. దీంతో ఇకపై కూడా నాలుగో తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కిమ్ భావిస్తున్నారు. దీనిలో భాంగా తన కూతురు కిమ్ జు యేను ఎంపిక చేశారు. అధికారిక సమాచారం లేనప్పటికీ కిమ్ కూతురు వయసు 13 ఏళ్లు. ఆమె 2013లో పుట్టింది. నవంబర్ 2022లో ఉత్తర కొరియా జరిపిన క్షిపణి పరీక్షకు కిమ్ జు యే హాజరైంది.
ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో తండ్రితోపాటు కనిపించింది. 2025లో బీజింగ్లో పర్యటించింది. గత జనవరిలో ఆమె కుముసన్ సహా కీలక ప్రాంతాల్ని సందర్శించింది. అంటే ఆమెను వారసురాలిగా సిద్ధం చేస్తున్నట్లుందని దక్షిణ కొరియా భావిస్తోంది. ఇప్పటికే ఆమె పాలనాపరమైన అంశాల్లో అధికారులకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నట్లు సమాచారం.