ప్యాంగ్యాంగ్, మార్చి 15 : శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించ గల రాకెట్ లాంచర్లను ఉత్తర కొరియా పరీక్షించింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, కుమార్తె కిమ్ జు ఆ సమక్షంలో శనివారం ‘600 ఎంఎం క్యాలిబర్’ 12 మల్టీపుల్ రాకెట్ లాంచర్లను ఉత్తర కొరియా పరీక్షించినట్టు ప్రభుత్వ మీడియా ‘కేసీఎన్ఏ’ వార్తా కథనం పేర్కొన్నది. జపాన్ సముద్ర జలాల్లో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు చేపట్టిన వేళ.. ఉత్తర కొరియా ఈ వ్యూహాత్మక అణు క్షిపణి పరీక్షలు జరపటం కీలకంగా మారింది.
సుమారుగా 450 కిలోమీటర్ల పరిధిలో శత్రుదేశాల్ని అంతమొందించటానికి ఈ తరహా రాకెట్ లాంచర్లను వాడతారు. సాధారణ రాకెట్ల కంటే భిన్నంగా, లక్షిత ప్రదేశంపై అణుదాడికి ఉపయోగిస్తారు. వ్యూహాత్మక అణ్వాయుధాల విధ్వంసక శక్తిపై ఆ దేశాలకు (యూఎస్, ద.కొరియా) అవగాహన కల్పించేందుకు ఉత్తర కొరియా ఈ ప్రయోగాలు జరిపినట్టు వార్తా కథనాలు పేర్కొన్నాయి.