సియోల్: ఉత్తర కొరియా ఇవాళ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. తూర్పు తీరం దిశగా ఆ ప్రయోగం జరిగినట్లు సౌత్ కొరియా మిలిటరీ పేర్కొన్నది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్కు సమీపంలో ఉన్న సునన్ నుంచి ఈ మిస్సైల్ పరీక్ష జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన మిలిటరీ పరేడ్ తర్వాత జరిగిన తొలి క్షిపణి పరీక్ష ఇది. అణ్వాయుధాలను మరింత వేగవంతంగా సేకరించనున్నట్లు ఆ పరేడ్ సమయంలో కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించిన విషయం తెలిసిందే. దానికి తగినట్లు ఇవాళ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సాగింది. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు జపాన్ రక్షణశాఖ కూడా స్పష్టం చేసింది.
ఆయుధాల పరీక్షలో ఉత్తర కొరియా దూసుకువెళ్తోంది. ప్రత్యర్థులకు ఒక రకంగా దడ పుట్టిస్తోంది. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అణ్వాయుధ పరీక్ష నిర్వహణకు కూడా ఉత్తర కొరియా ఏర్పాట్లు చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల జరిగిన పరేడ్లో హాసాంగ్17 ఖండాంతర క్షిపణిని ప్రదర్శించారు. దానితో పాటు ప్రదర్శనలో మల్టిపుల్ గెయింట్ రాకెట్ లాంచర్లు, సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైళ్లు కూడా ఉన్నాయి.
ఈ ఏడాది మిస్సైల్ పరీక్ష జరగడం ఇది 14వ సారి. అయితే మార్చి 16వ తేదీన జరిగిన పరీక్ష విఫలమైనట్లు తెలుస్తోంది. 2020లో కేవలం నాలుగు పరీక్షలు మాత్రమే ఉత్తర కొరియా చేపట్టింది. 2021లో 8 పరీక్షలు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 24వ తేదీ ఉత్తర కొరియా ఐసీబీఎంను కూడా పరీక్షించిన విషయం తెలిసిందే.