సియోల్: ఉత్తర కొరియా మళ్లీ క్షిపణులను ప్రయోగిస్తున్నది. గుర్తించని బాలిస్టిక్ క్షిపణిని ఆ దేశం ప్రయోగించినట్లు దక్షిణ కొరియా గురువారం ఆరోపించింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తమ దేశ పర్యటన ముగించుకున్న తర్వాత ఈ సంఘటన జరిగినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. పటిష్టమైన సైనిక రహిత ప్రాంతాన్ని కూడా ఆమె సందర్శించినట్లు చెప్పింది. ‘గుర్తించని బాలిస్టిక్ క్షిపణిని తూర్పు సముద్రంలోకి ఉత్తర కొరియా ప్రయోగించింది’ అని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. జపాన్ సముద్ర జలాల్లో ఆ క్షిపణి పడినట్లు వెల్లడించింది.
కాగా, అమెరికాకు చెందిన అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్తోపాటు మరికొన్ని యుద్ధ నౌకలు ఉమ్మడి సైనిక శిక్షణ కోసం దక్షిణ కొరియా నౌకాశ్రయానికి చేరాయి. ఈ నేపథ్యంలో బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ఆదివారం ప్రయోగించినట్లు తెలుస్తున్నది.
మరోవైపు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా దీనిని నిర్ధారించింది. జపాన్ కోస్ట్ గార్డ్తోపాటు ఆ దేశ నౌకా దళాన్ని అప్రమత్తం చేసింది. ఉత్తర కొరియా ప్రయోగించిన గుర్తించని క్షిపణి జపాన్ ప్రత్యేక ఆర్థిక జోన్ వెలుపల ఉన్న సముద్ర జలాల్లో పడినట్లు ఆ దేశ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.