ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తెకు తాజాగా ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఎవరికీ ఉండకుండా నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె ‘జు ఏ’ పేరు దేశంలోని ఏ బాలిక లేదా మహిళకు ఉండకూడదని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అలాంటి పేరు ఉన్న బాలికలు లేదా మహిళలు తమ పేరు, గుర్తింపును, బర్త్ సర్టిఫికెట్లను వెంటనే మార్చుకోవాలంటూ ఉత్తర కొరియా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశానికి చెందిన కొన్ని వర్గాలు ఈ విషయం వెల్లడించినట్లు ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, మంగళవారం జియోంగ్జు సిటీలో ‘జు ఏ’ పేరుతో నమోదైన మహిళలను భద్రతా మంత్రిత్వ శాఖ పిలిపించిందని, తమ పేర్లు మార్చుకోవాలని వారికి చెప్పారు. అలాగే 12 ఏళ్ల బాలిక ‘జు ఏ’ పేరును జనన ధృవీకరణ పత్రంలో మార్చాలని ఆమె తల్లిదండ్రులకు అధికారులు తెలిపారు. దీని కోసం వారం రోజుల్లో భద్రతా మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. ‘జు ఏ’ పేరును ప్రస్తుతం అత్యున్నత గౌరవం ఉన్న వ్యక్తుల కోసం రిజర్వ్ చేసినట్లుగా ఉత్తర కొరియా అధికారులు పేర్కొన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఉత్తర కొరియా సైనిక కవాతు సందర్భంగా కిమ్ కుమార్తె జు ఏ ఇటీవల తన తండ్రితో కలిసి బహిరంగంగా కనిపించింది. కవాతుకు ముందు రోజు సైనిక బ్యారక్లో జరిగిన విలాసవంతమైన విందులో కూడా ఆమె పాల్గొన్నది. దీనికి ముందు గత ఏడాది నవంబర్లో జు ఏ తొలిసారి ప్రపంచానికి పరిచయమైంది. పెద్ద క్షిపణి ముందు తండ్రి కిమ్ జోంగ్ ఉన్ చేయి పట్టుకుని కనిపించింది. ఈ నేపథ్యంలో కిమ్ తర్వాత ఆ దేశ పాలకురాలు ఆమె అన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.
2009లో రి సోల్ జుతో కిమ్కు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. అయితే ముగ్గురు పిల్లల్లో కేవలం కుమార్తె జు ఏ గురించి మాత్రమే బయట ప్రపంచానికి తెలిసింది.