Oman : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేసే ప్రణాళికలు ఏమీ లేవని గల్ఫ్ దేశం ఒమన్ (Oman) స్పష్టంచేసింది. టోల్ ఫీజు వసూలు చేయాలన్న ఇరాన్ (Iran) ప్రతిపాదనను ఒమన్ వ్యతిరేకించింది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ పంపిన 10 డిమాండ్లలో టోల్ ఫీజు వసూలు చేయడం కూడా ఉంది.
గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణాకు కీలక ప్రాంతం హర్మూజ్ జలసంధి. మొత్తం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ జలసంధికి ఇరువైపులా ఇరాన్, ఒమన్ దేశాలు ఉంటాయి. ఇప్పటివరకు ఈ మార్గం గుండా వెళ్లే నౌకలకు ఎలాంటి టోల్ ఫీజు లేదు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఇరాన్ టోల్ ఫీజు ప్రతిపాదన చేసింది. దీనికి అమెరికా కూడా అంగీకరించింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధికి ఇరువైపులా ఉన్న ఇరాన్, ఒమన్ దేశాలు టోల్ ఫీజు విధించే అంశంపై చర్చలు జరిపాయి.
అనంతరం ఒమన్ రవాణా శాఖ మంత్రి సయీద్ బిన్ హమూద్ బిన్ సయీద్ ఆల్ మాట్లాడుతూ.. నౌకలపై టోల్ ఫీజు విధించబోమని హామీ ఇచ్చే ఒప్పందాలపై సంతకం చేసినట్లు చెప్పారు. ఈ వ్యూహాత్మక కీలక ప్రదేశంలో స్వేచ్ఛాయుత, సురక్షితమైన నౌకాయానాన్ని కొనసాగించడానికి తమ దేశం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.