Bangladesh : బంగ్లాదేశ్ (Bangladesh) లో మైనారిటీలు అయిన హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఫెనీ జిల్లా (Feny district) లో ఆటోను దొంగిలించేందుకు యత్నించిన కొందరు దుండగులు.. 16 ఏళ్ల హిందూ బాలుడి (Hindhu boy) ని దారుణంగా హత్య చేశారు. ఢాకా-చిట్టగాంగ్ హైవేపై లాల్పోల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి మీడియా తెలిపింది.
హత్యకు గురైన బాలుడు శాంతో కుమార్ సాహాగా పోలీసులు గుర్తించారు. అక్కడి మీడియా కథనం ప్రకారం.. మియాజీ ఫిల్లింగ్ స్టేషన్ ముందు ఆటోలో ప్రయాణికుడి కోసం శాంతో ఎదురుచూస్తుండగా.. కొందరు దుండగులు అతడిపై దాడిచేసి, ఆటోను లాక్కునే ప్రయత్నం చేశారు. శాంతో వాళ్లను ప్రతిఘటించడంతో హైవే పక్కన ఉన్న కల్వర్టు కిందకి తోసేశారు. అయినా వెంటనే తేరుకుని దొంగలను వెంబడించిన శాంతోను వారు హత్యచేశారు.
రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనం కిందకి శాంతోను తోసేశారు. దాంతో ఆ వాహనం ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రాత్రి వరకు బాలుడి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా.. తెలిసిన ఆటో డ్రైవర్ ద్వారా సమాచారం అందినట్లు శాంతో బంధువులు తెలిపారు.
శాంతో ప్రయాణికులను ఎక్కించుకున్న ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే నిందితులను గుర్తించే అవకాశం ఉందని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇఫ్తార్ సమయంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని దుండగులు బాలుడిని టార్గెట్ చేసి, ఆటోను ఎత్తుకెళ్లారని రోపించారు. బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వ హయాంలోనూ హిందూ వర్గాలపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తతోంది. గతంలో మహమ్మద్ యూనస్ పాలనలోనూ మైనారిటీలపై వరుసదాడులు జరిగాయి.