వాషింగ్టన్ : కరోనా మహమ్మారి పిల్లలపైనా ప్రభావం చూపుతున్నది. అమెరికాలో పెద్ద ఎత్తున చిన్నారులు వైరస్ కారణంగా ఆసుత్రిపాలవుతున్నారు. ఇది ప్రపంచానికి ముప్పుగా సూచిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కొవిడ్ చిన్నారులపై అంత ప్రభావం ఉండకపోవచ్చన్న ప్రచారానికి విరుద్ధంగా చిన్నారులు వైరస్ బారినపడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) డేటా ప్రకారం.. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ప్రస్తుతం చిన్నారులు కొవిడ్కు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.
తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ప్రతి రోజు 893 మంది 17 ఏళ్లలోపు చిన్నారులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఆగస్ట్ 1, 2020, జనవరి 13, 2022 మధ్య అమెరికాలో 17 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న 90వేల కంటే ఎక్కువ మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారని సీడీసీ డేటా పేర్కొంది. పిల్లల్లో ఎక్కువ మంది నవజాత శిశువుల నుంచి నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉన్నారు. అయినప్పటికీ పిల్లల్లో మొత్తం ఆసుపత్రిలో చేరే రేటు పెద్దల కంటే తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.
కానీ, రాబోయే వారాల్లో పిల్లల్లో ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఐదు నుంచి అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కటికి వ్యాక్సిన్ వేయాలని సీడీసీ సిఫారసు చేస్తున్నది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంచనా ప్రకారం.. డిసెంబర్ 2021 చివరి నుంచి పిల్లల్లో కరోనా కేసులు, ఆసుపత్రిలో చేరిన కేసులు చాలా రెట్లు పెరిగింది. ఇదిలా ఉండగా.. అమెరికాలో ఇప్పటి వరకు 6.58కోట్ల మందికి కరోనా సోకింది. 8.5లక్షల మంది మహమ్మారి కారణంగా మృత్యువాతపడ్డారు.