అత్యంత వేగంగా వ్యాప్తి: డబ్ల్యూహెచ్వో
జనవరిలో యూకేలో గుర్తింపు
న్యూఢిల్లీ/లండన్, ఏప్రిల్ 2: కరోనా వైరస్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. ‘ఎక్స్ఈ’ అని పేరు పెట్టారు. మిగతా అన్ని వేరియంట్లతో పోల్చితే ఎక్స్ఈ అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించింది. దీన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొన్నది.
ఒమిక్రాన్లోని బీఏ.1, బీఏ.2 సబ్ వేరియంట్లు కలిసి ఎక్స్ఈ లాగా ఉత్పరివర్తనం చెందినట్టు తెలిపింది. ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన వేరియంట్గా భావిస్తున్న ఒమిక్రాన్ బీఏ.2 కన్నా ఇది 10% ఎక్కువ వేగంగా విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నది. యూకేలో జనవరి 19న తొలిసారి ఎక్స్ఈ వేరియంట్ను గుర్తించారు. అయితే, ప్రస్తుతం ఈ వేరియంట్కు సంబంధించిన కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఇదిలా ఉండగా, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెనీ అధ్యయనంలో మరో రెండు (ఎక్స్డీ, ఎక్స్ఎఫ్) వేరియంట్లను కూడా గుర్తించారు. ఎక్స్డీ ఫ్రాన్స్కు పాకినా.. ఎక్స్ఎఫ్ యూకేకే పరిమితమైనట్టు శాస్త్రవేత్తలు చెప్పారు.
వారంలో 50 లక్షల మందికి
యూకేలో మార్చి 19-26 మధ్యలో కేవలం వారం రోజుల్లోనే 49 లక్షల మంది పైగా కరోనా మహమ్మారి బారిన పడి ఉంటారని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు అంచనా వేసింది. అంతకు ముందు వారం 43 లక్షల మందికి వైరస్ సోకినట్టు పేర్కొన్నది. ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ కారణంగా యూకేలో కొద్ది రోజులుగా కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే.