బీజింగ్: చైనాలో కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఇంతకాలం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేసిన చైనా గత వారం అనూహ్యంగా ఆంక్షలను సడలించింది. లక్షణాలు లేని కరోనా కేసులను వెల్లడించడం ఆపేసింది. డిసెంబర్ 4 నుంచి ఒక్క కరోనా మరణం కూడా లేదని చెప్తున్నది. అయితే, వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. గత వారం రోజుల నుంచి కొవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని తెలుస్తున్నది. బీజింగ్లోని ఓ స్మశానవాటికలో గతంలో రోజుకు సుమారు 12 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగ్గా, ప్రస్తుతం 150 వరకు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి చైనాలో ఇప్పటివరకు 5,235 కరోనా మరణాలు సంభవించినట్టు ఆ దేశం చెప్తున్నది. వాస్తవంగా ఇంతకంటే చాలా ఎక్కువ మంది మరణించారనే వాదనలు ఉన్నాయి. జనవరి 22న చైనాలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. శీతాకాల సెలవులు ప్రారంభం కానున్నాయి. లక్షల మంది స్వంత గ్రామాలకు వెళ్లనున్నారు. దీంతో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రమాదంలో చైనా
పరిస్థితి ఇలాగే కొనసాగితే 2023 నాటికి కొవిడ్ మరణాల్లో చైనా కొత్త రికార్డు నెలకొల్పుతుందని అమెరికాకు చెందిన సంస్థ పేర్కొన్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి చైనాలో కొవిడ్ మరణాలు ఒక మిలియన్ (10 లక్షలు) దాటవచ్చని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది.