Border dispute | భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండు దేశాల సరిహద్దులకు సమీపంలో భారత్లో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రహదారి సీతామర్హిలోని అనేక ప్రాంతాలను నేపాల్ సరిహద్దులోని భీతమోడ్, జనక్పూర్తో కలుపుతుంది. ఇక్కడ వంతెన నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయాయి.
నేపాల్ సరిహద్దులోని దాదాపు 1.10 కి.మీ.లో రోడ్డు విస్తరణపై కొన్ని రోజుల క్రితం నేపాల్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర హోంశాఖకు లేఖ పంపినట్లు బిహార్ రాష్ట్ర రోడ్డు నిర్మాణ విభాగం (ఆర్సీడీ) అధికారి ఒకరు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్పష్టంగా గుర్తించిన సరిహద్దు ఉన్నందున నేపాల్ నుంచి వచ్చిన అభ్యంతరాలతో షాక్కు గురయ్యామని ఆ అధికారి చెప్పారు.
బిహార్ రాజధాని పాట్నాకు ఉత్తరాన 135 కి.మీ దూరంలో ఉన్న సీతామర్హి జిల్లాలోని సుర్సంద్ బ్లాక్లోని సరిహద్దు సమీపంలో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ నో మ్యాన్ ఏరియాకు రెండు వైపులా రెండు దేశాల చెక్పోస్టులు పనిచేస్తున్నాయి. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు సగం పూర్తికావచ్చాయి. వంతెన నిర్మిస్తే రాకపోకలు కొనసాగించవచ్చు.